తెలంగాణ

మిలియన్ మార్చ్‌కు సీఎం రేవంత్ పిలుపు.. కేసీఆర్ తట్టుకోగలడా!

సరికొత్త నిర్ణయాలతో దూకుడుగా వెళుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రే మిలియన్ మార్చ్ కు పిలుపిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చేపట్టిన మిలియన్ మార్చ్ ఓ సంచలనం. జేఏసీ పిలుపు ఇచ్చిన మిలియన్ మార్చ్ కు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా లక్షలాది తెలంగాణ ఉద్యమకారులు ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అప్పటి మిలియన్ మార్చ్ స్పూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మిలియన్ మార్చ్ కు పిలుపిచ్చారు. అయితే తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా అప్పుడు మిలియన్ మార్చ్ నిర్వహించగా.. ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా సీఎం రేవంత్ రెడ్డే అధికారికంగా మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నారు.

తెలంగాణ సచివాలయ ప్రాంగ‌ణంలో డిసెంబ‌రు 9వ తేదీన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఘ‌నంగా ఆవిష్కరిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో జ‌రిగిన మిలియ‌న్ మార్చ్ త‌ర‌హాలో ల‌క్ష‌లాది మంది తెలంగాణ బిడ్డ‌ల స‌మ‌క్షంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తామ‌ని తెలిపారు.స‌చివాల‌యం ప్రాంగ‌ణంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హా ప్ర‌తిష్టాప‌న‌కు భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని సీఎం రేవంత్ నిర్వ‌హించారు. అనంత‌రం మాట్లాడిన సీఎం.. భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని వైభ‌వంగా నిర్వ‌హించాల‌నుకున్నామ‌ని, వేద పండితుల‌ను సంప్ర‌దిస్తే ఈ రోజు మిన‌హా ద‌స‌రా వ‌ర‌కు మంచి రోజులు లేవని చెప్పార‌న్నారు.అందుకే హడావుడిగా కార్యక్రమాన్ని నిర్వ‌హించాల్సి వ‌చ్చింద‌న్నారు.

సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేద‌ని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో ఇచ్చిన మాట మేర‌కు సోనియా గాంధీ 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష‌ను నెర‌వేర్చార‌ని ముఖ్య‌మంత్రి కొనియాడారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కావ‌డం సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన అంశ‌మ‌న్నారు. 2014 నుంచి 2024 వ‌ర‌కు ప‌దేళ్లు తెలంగాణ‌ను పాలించిన వారు ఎన్నెన్నో నిర్మించామ‌ని, ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని గొప్ప‌లు చెప్ప‌కున్నార‌ని, కానీ తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. తామే తెలంగాణ‌కు స‌ర్వ‌స్వ‌మ‌ని భావించార‌ని, తానే తెలంగాణ,తెలంగాణే తాను అనే విధంగా విధంగా గత పాలకులు వ్యవహరించార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అలాంటి విధానాల‌కు విరుద్ధ‌మ‌న్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరిట గ‌డీ నిర్మించుకొని, భారీ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసు ప‌హారా పెట్టుకొని తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అందులోకి రాకుండా నిషేధించార‌ని, తాము అధికారంలో వ‌చ్చాక ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరును ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ‌డీగా మారిన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చి దేశానికి ఆద‌ర్శంగా నిలిచామ‌ని, ఇప్పుడు ఎవ‌రైనా ప్ర‌జా భ‌వ‌న్‌లో స్వేచ్ఛ‌గా వెళ్ల‌వ‌చ్చ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

పాల‌న‌కు గుండెకాయ లాంటి స‌చివాల‌యంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని తాము నిర్ణ‌యించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పాల‌న‌కు సంబంధించిన నిర్ణ‌యాల‌న్నీ ఇక్కేడ జ‌రుగుతాయ‌ని, ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుపుకొనే అవకాశం ఇక్క‌డే ఉంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ప‌దేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా, మంత్రులుగా ఉన్న వారు స‌చివాల‌యంలోకి ప్ర‌జ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించ‌లేద‌ని ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌దేళ్ల‌లో రూ.22.50 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ పెట్టిన వారికి రూ.కోటి పెట్టి స‌చివాల‌యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు మనసు రాలేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. నెక్లెస్ రోడ్‌, ట్యాంక్ బండ్ చుట్టుప‌క్క‌ల ఈ దేశం, రాష్ట్రం కోసం ఎంతో చేసిన అంబేడ్క‌ర్‌, ఇందిరా గాంధీ, అంజ‌య్య‌, పి.వి.న‌ర‌సింహారావు, కాకా వెంక‌ట‌స్వామి విగ్ర‌హాలు, జైపాల్ రెడ్డి స‌మాధి ఉన్నాయ‌ని, వీటి మ‌ధ్య రాజీవ్ గాంధీ విగ్ర‌హం లేని లోటుగా క‌నిపించింద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. స‌చివాల‌యం ఎదుట ప్ర‌దేశాన్ని త‌మ స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం కొంద‌రు ఉంచుకోవాల‌ని భావించార‌ని, కానీ మేధావుల సూచన మేరకే తాము అక్క‌డ‌ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. దేశం కోసం ఎంతో చేసిన రాజీవ్ గాంధీ విగ్ర‌హం పెడితే తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంతో ముడిపెట్టి దానిని వివాదం చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పదేళ్లు అధికారంలో ఉండి గ‌త పాల‌కులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేద‌ని, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని జూన్ రెండో తేదీనే తాను ప్ర‌క‌టించాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కన్నతల్లిని తల‌పించేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్ర‌హం ఉండాలనేది త‌మ అభిమ‌త‌మ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. దొర‌ల గ‌డీల ఆన‌వాళ్లు విగ్ర‌హంలో ఉండ‌కూడ‌ద‌ని, అందుకే తెలంగాణ ప్ర‌జ‌ల అభిమ‌తానికి త‌గిన‌ట్లు తెలంగాణ త‌ల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను తెలంగాణ బిడ్డ‌, జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం క‌ళాశాల ప్రిన్సిప‌ల్‌కు అప్పగించామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని 2009, డిసెంబ‌రు 9న మ‌న్మోహ‌న్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని, అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జ‌న్మ‌దినం కావ‌డంతో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు అని ముఖ్య‌మంత్రి అన్నారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. ఇది అరుదైన అవకాశం… ఇటువంటి అరుదైన అవ‌కాశం అంద‌రికీ రాద‌ని, ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం త‌న‌కు ద‌క్కింద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button